సచివాలయం కూల్చివేతపై స్టే పొడిగింపు
నివేదికలపై హైకోర్టు అసంతృప్తి
హైదరాబాద్: తెలంగాణ సచివాలయం కూల్చివేతపై స్టే ఇచ్చిన హైకోర్టు మరోసారి స్టేను పొడిగించింది. సెక్రటేరియెట్ కూల్చివేత పనులు నిలిపివేయాలని కోరుతూ పి.ఎల్.విశ్వేశ్వరరావు పిల్ చేసిన విషయం తెలిసిందే. అయితే సచివాలయ భవనాల కూల్చివేతకు పర్యావరణ అనుమతి అవసరమా? లేదా అన్నదానిపై స్పష్టత ఇవ్వాలని బుధవారం ప్రభుత్వాన్ని కోరింది. దీనికి సంబంధించి గురువారం పీసీబీ, రాష్ట్రస్థాయి పర్యావరణ మదింపు అథారిటీ నివేదికలు సమర్పించారు. ఐతే ఆ నివేదికలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సూటిగా సమాధానం చెప్పకుండా తెలివిగా నివేదికలు ఇచ్చారని వ్యాఖ్యానించింది. నిర్మాణానికి భూమిని సిద్ధం చేయడమంటే ఏంటి? పాత భవనాలు కూల్చడమంటే కొత్త నిర్మాణానికి సిద్ధం చేయడమే కదా? అని ప్రశ్నించింది. కూల్చివేతలకు పర్యావరణ అనుమతి అవసరమా? లేదా? చెప్పాలని నిలదీసింది. ఐతే కేంద్ర పర్యావరణ శాఖ నుంచి తమకు సమాచారం రాలేదన్న అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్.. సోమవారం వరకు సమయం ఇవ్వాలని కోరారు. ఈ వివాదంలో కేంద్ర ప్రభుత్వం స్పందన కీలకమని అభిప్రాయపడిన హైకోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/