టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..హైకోర్టు కీల‌క తీర్పు

కేసులో దర్యాప్తుపై స్టే ఎత్తివేసిన తెలంగాణ హైకోర్టు

TS High Court
TS High Court

హైదరాబాద్ః టిఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ముగ్గురు వ్యక్తులు యత్నించిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసుల దర్యాప్తుపై స్టే విధించిన తెలంగాణ హైకోర్టు… తాజాగా ఆ స్టేను ఎత్తి వేసింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేసుకోవచ్చంటూ హైకోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. అంతేకాకుండా ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ బిజెపి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.

మొయినాబాద్ పరిధిలోని టిఆర్ఎస్ ఎమ్మెల్యేకు చెందిన ఫామ్ హౌస్ లో ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే దిశగా రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్ లు చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముందుగానే పోలీసులకు సమాచారం అందజేచయగా… నిందితులను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే నిందితుల కస్టడీకి తొలుత ఏసీబీ కోర్టు నిరాకరించగా… పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. నిందితుల రిమాండ్ కు ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు… కేసు దర్యాప్తుపై మాత్రం స్టే విధించింది. తాజాగా దర్యాప్తుపై స్టేను హైకోర్టు ఎత్తివేసింది. నిందితుల రిమాండ్ కు కూడా పోలీసులు ట్రయల్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చని తెలిపింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/