తమిళనాడు సిఎంకు సిఎం కెసిఆర్ కృతజ్ఞతలు
తెలంగాణకు తమిళనాడు ప్రభుత్వం రూ.10 కోట్లు వరద సాయం
హైదరాబాద్: తెలంగాణ సిఎం కెసిఆర్ తమిళనాడు సిఎం పళనిస్వామికి ఈరోజు ఉదయం ఫోన్ చేశారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ర్టానికి ఆర్థిక సాయం అందించడంపై సిఎం పళనిస్వామికి సిఎం కెసిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ర్టంలో ప్రస్తుత పరిస్థితిని పళనిస్వామికి కెసిఆర్ వివరించారు. నగదు, వస్తు రూపంలో సాయం అందించేందుకు నిర్ణయం తీసుకుని తమ ఉదారత చాటుకున్నారని తమిళనాడు సిఎంను కెసిఆర్ అభినందించారు.
కాగా భారీ వర్షాలు, వరద బీభత్సంతో అతలాకుతలమవుతున్న తెలంగాణకు తమిళనాడు ప్రభుత్వం అండగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎం పళనిస్వామి సోమవారం సిఎం కెసిఆర్ కు లేఖ రాశారు. తెలంగాణకు తక్షణం రూ.10 కోట్లు వరద సాయంగా అం దిస్తున్నట్టు తెలిపారు. ‘భారీ వర్షాలు, అంచనాలకుమించి వచ్చిన వరదతో హైదరాబాద్తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆస్తి, ప్రాణ నష్టం జరుగడం దురదృష్టకరం. ప్రాణాలు కోల్పోయిన వారికి తమిళనాడు ప్రభుత్వం, ప్రజల తరఫున ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తున్నాం. వారి కుటుంబాలకు తీవ్ర సానుభూతి వ్యక్తంచేస్తున్నాం. ఈ ఆపత్కాలంలో తెలంగాణ ప్రజలకు సహకారం అందించాలనే ఉద్దేశంతో ముందస్తుగా సిఎం రిలీఫ్ ఫండ్ నుంచి వెంటనే రూ.10 కోట్లు అందించాల్సిందిగా సంబంధిత అధికారును ఆదేశించాను. వరద ప్రాంతాల్లోని ప్రజలకు పంపిణీ చేసేందుకు బ్లాంకెట్లు, దుప్పట్లు, ఇతర సామగ్రి కూడా పంపాలని సూచించాను. ఇక ముందు తెలంగాణకు కావాల్సిన సాయాన్ని అందించేందుకు తమిళనాడు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని పళనిస్వామి లేఖలో పేర్కొన్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/