ఆ వ్యాఖ్యలు దిగ్విజయ్ వ్యక్తిగత అభిప్రాయాలుః రాహుల్ గాంధీ
మన సాయుధ దళాల పట్ల మాకు పూర్తి విశ్వాసం ఉంది..రాహుల్
శ్రీనగర్: సర్జికల్ స్ట్రయిక్స్ కు ఆధారాలు చూపలేకపోయారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలతో ఆ పార్టీ ఎంపీ రాహల్ గాంధీ విభేదించారు. జమ్మూ అండ్ కశ్మీర్ లో భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై స్పందించారు. అవి దిగ్విజయ్ సింగ్ వ్యక్తిగత అభిప్రాయాలుగా పేర్కొన్నారు.
‘‘మన సాయుధ దళాల పట్ల మాకు పూర్తి విశ్వాసం ఉంది. వారు దేశం కోసం ఎంతో గొప్పగా పనిచేస్తున్నారు. సర్జికల్ స్ట్రయిక్స్ పట్ల మా విధానం చాలా స్పష్టం’’అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ విభేదించడంతో దిగ్విజయ్ సింగ్ వైఖరిలోనూ మార్పు వచ్చింది. రక్షణ దళాల పట్ల అమిత గౌరవం ఉందని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు.
మరోవైపు బాలీవుడ్ సీనియర్ నటి ఊర్మిళా మతోండ్కర్ మంగళవారం జమ్మూ అండ్ కశ్మీర్ రాష్ట్రంలో భారత్ జోడో యాత్రలో పాల్గొంది. రాహుల్ తో కలసి కొంత దూరం నడిచింది. నటులు వచ్చి చేరినప్పుడు ఆ ప్రయాణం మరింత ప్రకాశవంతంగా ఉంటుందంటూ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. భారత్ జోడో యాత్ర ముగింపు దశలో ఉండడం గమనార్హం.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/category/telangana/