ప్రపంచమంతా ఇబ్బంది పడే అవకాశం ఉంది:ట్రంప్

చైనా, రష్యాలు రివర్స్ ఇంజినీరింగ్ కు పాల్పడితే..?: డొనాల్డ్ ట్రంప్ ఆందోళన

వాషింగ్టన్: 21 సంవత్సరాలపాటు ఆప్ఘనిస్థాన్ లో ఉన్న అమెరికా, నాటో బలగాలు ఆ దేశం నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే మెరుపువేగంతో తాలిబన్లు ఆప్ఘన్ ను ఆక్రమించుకున్నారు. అయితే, పోతూపోతూ అమెరికా బలగాలు దాదాపు 80 బిలియన్ డాలర్ల విలువైన అత్యాధునిక ఆయుధాలను అక్కడే విడిచి పోయారు. వీటిలో అధునాతనమైన అపాచీ-73 హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఇవన్నీ తాలిబన్ల అధీనంలో ఉన్నాయి. మరోవైపు తాలిబన్లకు మద్దతుగా నిలిచేందుకు చైనా, రష్యాలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ ఆయుధాలపై చైనా, రష్యాలు కన్నేసి… వాటిపై రివర్స్ ఇంజినీరింగ్ చేస్తే అంతకంటే అవమానం అమెరికాకు మరొకటి ఉండదని ట్రంప్ అన్నారు. రివర్స్ ఇంజినీరింగ్ కు పాల్పడటంలో ఆ రెండు దేశాలు దిట్ట అని వ్యాఖ్యానించారు. రివర్స్ ఇంజినీరింగ్ ద్వారా ఆయుధాల టెక్నాలజీని ఉపయోగించి, ఆయుధాలను సొంతంగా తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న ఆయుధాలు చివరకు తాలిబన్లకు కూడా చేరే ప్రమాదం ఉందని ట్రంప్ అన్నారు. ప్రెసిడెంట్ జో బైడెన్ తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగా యావత్ ప్రపంచం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని ట్రంప్ మండిపడ్డారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/