లెబనాన్కు తోడుగా ఉంటాం
ఇది పేలుడు పదార్థాల తయారీ వల్ల సంభవించలేదు..బాంబు దాడి అని భావిస్తున్నాం..ట్రంప్
వాషింగ్టన్: లెబనాన్ రాజధాని బీరూట్లో భారీ పేలుళ్లు సంభవించి 78 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ విచారం వ్యక్తం చేశారు. లెబనాన్కు తమ దేశం తోడుగా ఉంటుందని, ఆ దేశానికి ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధమని ట్రంప్ ప్రకటించారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ ఘటన భయంకరమైన దాడిలా కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇది పేలుడు పదార్థాల తయారీ వల్ల సంభవించలేదని, బాంబు దాడి అని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై తాను తన యంత్రాంగంలోని కొంతమంది అత్యుత్తమ జనరల్స్తో మాట్లాడానని, తనతో వారు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని తెలిపారు. కాగా, తాము గతంలో స్వాధీనం చేసుకున్న ఓ నౌకలోని పేలుడు పదార్థాలను పోర్టు ఏరియాలో నిల్వ చేశారని, వాటి వల్లే ఈ ఘటన సంభవించినట్లు లెబనీస్ జనరల్ సెక్యూరిటీ చీఫ్ అబ్బాస్ ఇబ్రహీం కూడా వెల్లడించారు. కాగా, లెబనాన్ ప్రజల కోసం తాము ప్రార్థిస్తున్నామని, బాధిత కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నామని అమెరికా అధ్యక్ష ఎన్నికల డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ చెప్పారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/