విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కి టిఆర్ఎస్ సపోర్ట్..?
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు టిఆర్ఎస్ సపోర్ట్ ఇవ్వబోతుందా..? అంటే అవుననే అన్నారు ఎన్సీపీ నేత శరద్ పవార్. దేశంలోనే అత్యున్నత పదవి అయిన భారత రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు రాష్ట్రపతి ఎన్నికలపైనే ఫోకస్ చేసాయి. కాగా విపక్ష పార్టీలు రాష్ట్రపతి అభ్యర్థి గా పలువుర్ని అనుకోగా వారు తిరస్కరించడం తో చివరిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా ను ఖరారు చేసారు. పార్లమెంట్ ఎన్ఎక్స్ భవన్లో సమావేశమైన 18 ప్రతిపక్షాల పార్టీల నాయకులు యశ్వంత్ సిన్హా పేరును ఏకగ్రీవంగా ప్రతిపాదించాయి. ఎన్సీపీ నేత శరద్ పవార్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. విపక్షాల నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ప్రకటించారు. అన్ని పార్టీలు తనకు మద్దతు ఇవ్వాలని యశ్వంత్ సిన్హా విజ్ఞప్తి చేశారు. యశ్వంత్ సిన్హా గతంలో కేంద్ర ఆర్థిక, విదేశాంగ శాఖల మంత్రిగా పని చేశారు.
మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హాకు గులాబీ పార్టీ మద్దతు ప్రకటించినట్లు తెలుస్తుంది. సీఎం కేసీఆర్ తో ఫోన్ లో శరద్ పవార్ మాట్లాడారు. కేసీఆర్…యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇచ్చేందుకు సానుకూలంగా స్పందించారని శరద్ పవార్ చెప్పారు. అయితే, టీఆర్ఎస్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. బీజేపీ, కాంగ్రెస్ కు సమదూరం యశ్వంత్ సిన్హా పాటిస్తున్నారు. యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇవ్వడం ద్వారా బీజేపీ, కాంగ్రెస్ కు సమదూరం పాటించామన్న మెసేజ్ ప్రజలకు పంపే యోచనలో టీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది.
మరోపక్క ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ను ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన చేసారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన 64 ఏళ్ల ద్రౌపది ముర్ము.. ఆదివాసీ (ఎస్టీ) సామాజికవర్గానికి చెందిన వారు. ద్రౌపది ముర్ము ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా బైడపోసిలో జన్మించారు. ఝార్ఖండ్ గవర్నర్గా పనిచేశారు. ద్రౌపది ముర్ము భర్త పేరు శ్యామ్చరణ్ ముర్ము. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఉపాధ్యాయురాలిగా జీవితం ప్రారంభించిన ద్రౌపది ముర్ము.. అనంతరం రాజకీయాల్లో ప్రవేశించారు. వివాదాలు లేని వ్యక్తిగా గుర్తింపు పొందారు. 2015-2021 వరకు జార్ఖండ్ గవర్నర్గా పని చేశారు. జార్ఖండ్ తొలి మహిళా గవర్నర్ అయిన ముర్ము 2000-04 మధ్యలో ఒడిశా రవాణా, ఫిషరీస్ శాఖల మంత్రిగా పని చేశారు.