ఏడాది క్రితం ఓ ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఏం జరిగిందో చూశారుగా?

యూపీ సిఎం యోగికి మంత్రి కెటిఆర్‌ కౌంటర్‌

TS Minister KTR-
TS Minister KTR-

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో యూపీ సిఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారానికి వచ్చిన వేళ, తెలంగాణలో ఆడ బిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలపై మంత్రి కెటిఆర్‌ ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఏడాది క్రితం ఓ ఆడబిడ్డకు అన్యాయం జరిగితే, హైదరాబాద్ లో ఏం జరిగిందో అందరూ చూశారని అన్నారు. యూపీలో ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే, ప్రభుత్వం ఏమి చేస్తోందో కూడా చూశామని సెటైర్లు వేశారు. మోడి ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిందని, ఆ లెక్కన ఈ ఆరేళ్లలో 12 కోట్ల ఉద్యోగాలు రావాల్సి వుండగా, కొత్త ఉద్యోగాల బదులు, ఉన్న ఉద్యోగాలు పోతున్నాయని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి చెందాలంటే, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలిచి తీరాల్సి వుందని, టిఆర్ఎస్ అభ్యర్థులకే ఓటు వేయాలని కెటిఆర్ కోరారు. కేంద్రానికి రూ. 2.72 లక్షల కోట్లను తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తే, కేవలం రూ.1.40 లక్షల కోట్లను మాత్రమే ఇచ్చారని, ఇది రూపాయి కడితే ఆఠాణా ఇచ్చినట్టని సెటైర్లు వేశారు.

ప్రజలకు ఏమీ చేయని బిజెపి, పని చేస్తున్న టిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని అడ్డుకుంటోందని వ్యాఖ్యానించిన కెటిఆర్, ఐటీ రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తామని చెప్పిన బిజెపి ఐటీఐఆర్ ను రద్దు చేసిందని, దాని ఫలితంగా యువత నోట్లో మట్టి కొట్టినట్లయిందని అన్నారు. తెలంగాణలో నిజాం సంస్కృతిపోయి, 1920లోనే గాంధీ సామరస్యత వచ్చిందని, గడచిన ఆరేళ్లలో తెలంగాణ అభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వం ఒక్కరూపాయి కూడా కేటాయించలేదని మండిపడ్డారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/