మునుగోడు టీఆర్ఎస్‌లో అస‌మ్మ‌తి సెగ

మునుగోడు ఉప ఎన్నికలో నేపథ్యంలో టీఆర్ఎస్‌లో అస‌మ్మ‌తి సెగ భగ్గుమంది.మునుగోడు ప‌రిధిలోని స్థానిక సంస్థ‌ల ప్ర‌జా ప్ర‌తినిధులు చౌటుప్ప‌ల్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఉప ఎన్నిక‌ల్లో కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డికి టికెట్ ఇవ్వ‌రాద‌ని వారంతా ఓ తీర్మానాన్ని ఆమోదించారు. కూసుకుంట్ల‌కు టికెట్ ఇస్తే తాము పార్టీ విజ‌యం కోసం ప‌నిచేసేది లేద‌ని కూడా వారు తేల్చి చెప్పారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం తో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైంది. మరో మూడు నెలల్లో ఉప ఎన్నిక జరగబోతుండడం తో అన్ని పార్టీ లు ఉప ఎన్నికపై కసరత్తులు మొదలుపెడుతున్నాయి. బిజెపి నుండి రాజగోపాల్ బరిలోకి దిగుతుండడం తో విజయం ఫై ధీమా వ్యక్తం చేస్తుంది బిజెపి. మరోపక్క కాంగ్రెస్ పార్టీ సైతం గెలుపు ఫై ధీమాగా ఉన్నారు. ఈ తరుణలో టిఆర్ఎస్ పార్టీ ఆచితూచి అడుగులేస్తోంది.

ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో ప్రగతిభవన్ లో సమావేశమయ్యారు. మునుగోడు ఉప ఎన్నిక‌పై జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య, ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ తో కేసీఆర్ చర్చించారు. ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై మాట్లాడారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరపున ఎవరిని బరిలో దింపితే గెలుస్తారు..? ఎవరికి విజయావకాశాలు ఉన్నాయి..? అనే వివరాలపైనా ఆరా తీశారు. టిక్కెట్ ఎవరికి ఇచ్చినా అందరూ కలిసి కష్టపడి పని చేయాలని, తప్పనిసరిగా మునుగోడు ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగురవేయాలని నాయకులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ నెల 20 భారీ బహిరంగ సభ కు ప్లాన్ చేసారు. ఇదిలా ఉండగానే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇస్తే.. తాము సహరించబోమని కొందరు నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే తమతమ నిరసనను తెలియజేసిన స్థానిక ప్రజాప్రతినిధులు.. మరో అడుగు ముందుకేసి రహస్యంగా భేటీ అయ్యారు. ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

కూసుకుంట్ల వ్యతిరేక వర్గం ఆందోల్ మైసమ్మ దేవాలయం వద్ద ఓ ఫంక్షన్ హాల్ లో రహస్య భేటీ అయింది. మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ ఛైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, కొందరు క్రియాశీలక కార్యకర్తలు రహస్యంగా సమావేశమై.. మంతనాలు జరిగిపారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇస్తే.. కచ్చితంగా ఓడించాలని రహస్య భేటీలో వ్యతిరేక వర్గం నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరి దీనిపై కేసీఆర్ ఎలా ఆలోచిస్తాడో చూడాలి.