ఎమ్మెల్సీ ఎన్నికలో కవిత ఘనవిజయం
నిజామాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఘనవిజయం సాధించారు. ఈ ఎన్నికలో అభ్యర్థి గెలవడానికి మేజిక్ ఫిగర్ 413 ఓట్లు కాగా, అంతకు మించి ఓట్లు పోలవడంతో మొదటి రౌండ్ కౌంటింగ్లోనే ఆమె విజయం ఖాయం అయ్యింది. అయితే ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బిజెపికి ఈ ఎన్నికలో డిపాజిట్ కూడా దక్కలేదు. మొత్తం 824 ఓట్లలో 823 ఓట్లు పోలయ్యాయి. ఇందులో కవితకు 728 ఓట్లు వచ్చాయి. బిజెపి అభ్యర్థికి 56 ఓట్లు, కాంగ్రెస్కు 29 ఓట్లు వచ్చాయి. మొత్తం పది ఓట్లు చెల్లుబాటు కాలేదు.
ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదటి రౌండ్లో 600 ఓట్లకుగాను టిఆర్ఎస్కు 542 ఓట్లు వచ్చాయి. బిజెపికి 39, కాంగ్రెస్ 22 ఓట్లు పోలయ్యాయి. 8 ఓట్లు చెల్లకుండా పోయాయి. రెండో రౌండ్లో 221 ఓట్లకుగాను టిఆర్ఎస్కు 197, బిజెపికి 17, కాంగ్రెస్పార్టీకి 7 ఓట్లు వచ్చాయి. రెండు ఓట్లు చెల్లుబాటుకాలేదు. అక్టోబర్ 9న జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 823 మంది ప్రజాప్రతినిథులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇద్దరు ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు వేశారు. కాగా, ఎమ్మెల్సీగా తన గెలుపునకు సంబంధించిన ధ్రువపత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి కవిత మరికాసేపట్లో అందుకోనున్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/