YSRTP నేత,ప్రజా గాయకుడు ఏపూరి సోమన్నపై టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి

YSRTP నేత, ప్రజా గాయకుడు ఏపూరి సోమన్నపై టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం లక్కవరం గ్రామంలో చోటుచేసుకుంది. ప్రజాప్రస్థానంలో భాగంగా పార్టీ అధినేత షర్మిల ఈరోజు లక్కవరం గ్రామంలో నిరుద్యోగ నిరాహారదీక్ష చేపట్టారు. ఈ దీక్షలో పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాలుపంచుకున్నారు. కార్యక్రమంలో షర్మిల ప్రసంగిస్తుండగా దీక్షా ప్రాంగణం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏపూరి సోమన్న పక్కనున్న మహిళా నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగగా.. తోసేసే ప్రయత్నం చేయడాన్ని గమనించిన షర్మిల ఆగ్రహానికి లోనయ్యారు. ఆడవాళ్లపై దాడి చేస్తారా.. అంటూ మండిపడ్డారు.

ఎమ్మెల్యే సైదిరెడ్డే టీఆర్ఎస్ గూండాలను పంపారని షర్మిల ఆరోపించారు. దీక్షా స్థలానికి వచ్చిన టీఆర్ఎస్ మఠంపల్లి మండల అధ్యక్షుడు పిచ్చయ్యపై మండిపడ్డారు షర్మిల. మహిళలపై దాడి చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు షర్మిల. వైఎస్ విగ్రహం వద్దకు చేరుకుని కార్యకర్తలతో కలసి బైఠాయించారు. పోలీసు జులుం నశించాలి.. టీఆర్ఎస్ డౌన్.. డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దాడికి ప్రయత్నించిన ఇద్దర్నీ చూశారు కదా.. చూసి కూడా ఎందుకు పట్టుకోలేదు.. వాళ్లిద్దర్నీ తీసుకుని రండి.. కేసు పెట్టి అరెస్టు చేసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ షర్మిల తేల్చి చెప్పారు.