దోషులకు పూల దండలతో స్వాగతం పలకడం మాయని మచ్చః మంత్రి కెటిఆర్
బిల్కిస్ బానో కేసు విషయంలో ట్రోలింగ్ పై స్పందించిన కెటిఆర్
హైదరాబాద్ః గుజరాత్లోని బిల్కిస్ బానో అత్యాచార దోషుల్ని విడుదల చేయటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కెటిఆర్ ఇదే ఘటనపై తనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగడంపై కెటిఆర్ స్పందించారు. ఇవన్నీ ‘సిల్లీ ట్రోల్స్’ అన్నారు. బిల్కిస్ బానో కేసులో విడుదలైన ఖైదీలకు మిఠాయిలు, పూలదండలతో స్వాగతం పలకడంపై స్పందిస్తూ ‘ఇది మన దేశ సామూహిక మనస్సాక్షికి మాయని మచ్చ. ఈ రోజు బిల్కిస్ బానోకి జరిగినది రేపు మనలో ఎవరికైనా జరగవచ్చు’ అని కెటిఆర్ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ తర్వాత హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఇటీవల జరిగిన అత్యాచారం కేసును కొందరు తెరపైకి తెచ్చారు. ఈ కేసులోని నిందితులంతా బెయిల్ పై బయటికి రావడంపై కెటిఆర్ పై పలువురు విమర్శలు చేశారు. తనపై ట్రోల్స్ రావడాన్ని గుర్తించిన కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. జూబ్లీహిల్స్ అత్యాచారం కేసు నిందితులకు శిక్షపడే వరకు పోరాడుతామని చెప్పారు.
‘ఇటీవల హైదరాబాద్లో జరిగిన అత్యాచారం కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించే సిల్లీ ట్రోల్స్ కు ఇదే సమాధానం. హైదరాబాద్ కేసులో నిందితులను త్వరగా అరెస్టు చేసి జైలుకు పంపారు. 45 రోజుల తర్వాత, హైకోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. రేపిస్టులకు చట్ట ప్రకారం శిక్ష పడే వరకూ మేం పోరాడుతూనే ఉంటాం. జువెనైల్ జస్టిస్ యాక్ట్, ఐపీసీ, సీఆర్పీసీలోని లొసుగుల కారణంగా జూబ్లీహిల్స్ కేసులో రేపిస్టులు బెయిల్పై విడుదలయ్యారు. అందుకే ఈ చట్టాలను సవరించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అప్పుడే ఏ రేపిస్ట్ బెయిల్ పొందలేడు. దోషిగా తేలినప్పుడు, మరణించే వరకు జైలులోనే ఉంటాడు’ అని కెటిఆర్ స్పష్టం చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/