ముంబయి మరణహోమానికి 12 ఏళ్లు
నేడు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ముంబయి పోలీసులు

ముంబయి: నవంబర్ 26, 2008… ముంబయి మహానగరంపై ముష్కరమూకలు దాడికి దిగిన రోజు. పాకిస్థాన్ నుంచి సముద్ర మార్గం ద్వారా వచ్చిన పది మంది అత్యాధునిక తుపాకులతో విరుచుకుపడిన వేళ, 18 మంది భద్రతా సిబ్బంది అమరులు కాగా, 166 మంది అమాయక ప్రజలు బలయ్యారు. ఎన్నో వందల మందికి గాయాలూ అయ్యాయి. ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఎన్ఎస్జీ తో పాటు సైన్యం, మహారాష్ట్ర పోలీసులు రెండు రోజుల పాటు ఆపరేషన్ నిర్వహించి 9 మందిని హతమార్చగా, పట్టుబడిన కసబ్ కు కోర్టు మరణదండన విధించింది.
ఈ మారణ హోమానికి నేటితో పన్నెండేళ్లు పూర్తి కావడంతో, అమరులకు నివాళులు అర్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే, కరోనాను దృష్టిలో ఉంచుకుని ప్రజలను మాత్రం పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తున్నామని, దక్షిణ ముంబయిలోని పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఇటీవల నిర్మించిన స్మారక చిహ్నం వద్ద ఈ కార్యక్రమం జరుగుతుందని ఉన్నతాధికారులు తెలిపారు. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ, సీఎం ఉద్ధవ్ థాకరేతో పాటు పలువురు మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు, అమరులైన పోలీసుల కుటుంబీకులు కార్యక్రమంలో పాల్గొననున్నారు.
అంతకు ముందు కేంద్ర మంత్రులు అమిత్షా, పియూష్ గోయల్, నితిన్ గడ్కరీ 26/11 ఉగ్రవాద దాడి బాధితులకు నివాళులర్పించారు.’ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ నివాళులర్పిస్తున్నాను. వారి కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నాను’ అన్నారు. ఈ దాడుల్లో ఉగ్రవాదులను ఎదుర్కొన్న ధైర్య భద్రతా సిబ్బందికి కృతజ్ఞతలు. ఈ దేశం మీ ధైర్యానికి, త్యాగానికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలుపుతుంది అంటూ ట్వీట్చేశారు. ఉగ్రవాదులతో ధైర్యంగా పోరాడి మదర్ ఇండియా కోసం త్యాగం చేసిన భద్రతా దళాల సిబ్బందికి కృతజ్ఞతలు అంటూ పీయుష్ గోయల్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘ముంబై ఉగ్రవాద దాడి అమరవీరులకు వందనం’ అని కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి గడ్కరీ ట్వీట్ చేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/