గడప గడపకు కార్య క్రమంలో ..వైసీపీ ఎమ్మెల్యేను బండబూతులతో కొట్టేంత పనిచేసిన మహిళలు

గడప గడపకు మన ప్రభుత్వ కార్య క్రమంలో వైసీపీ నేతలకు ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు. కొట్టడం ఒక్కటే తక్కువ అన్నట్లు ఉంది. ఆ నేత..ఈ నేత అని కాదు ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలే ఎదురువుతున్నాయి. ఏ కార్యక్రమం రా బాబు అంటూ నేతలు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. బయటకు ఈ కార్యక్రమం బాగా జరుగుతుందని , ప్రతి చోట ప్రజలు అభినందలు తెలుపుతున్నారని, మళ్లీ జగన్ ప్రభుత్వమే కావాలని అంటున్నారని నేతలు బయటకు చెపుతున్నారు కానీ అక్కడ జరిగేది మాత్రం మీ ప్రభుత్వానికి ఓటేసినందుకు చెప్పలేసుకుంటున్నారు.

ఇక నిన్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో అరకులోయ ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణకు చేదు అనుభవం ఎదురైంది. ఆయనను చూడగానే మహిళలు ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు. ఎమ్మెల్యే మెడలోని కండువా పట్టుకుని దాడికి యత్నించారు. బండబూతులు తిడుతూ పరుగులు పెట్టించారు. దీంతో పోలీసుల రక్షణ మధ్య ఆయన బయటపడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం మాడగడ గ్రామంలో ఈ ఘటన జరిగింది.

‘‘మా భూములను కబ్జా చేసి మళ్లీ మా ఊరే వస్తావా?’’ అంటూ ఆయన మెడలోని కండువా పట్టుకుని నిలదీశారు. గిరిజనులందరూ గుమికూడి ఆయనపైకి ఎగబడి దాడికి యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకుని దూరంగా తీసుకెళ్లారు. అయినా శాంతించని గ్రామస్థులు భూములను కబ్జా చేస్తావా? అని దుర్భాషలాడుతూ వెంబడించారు. దీంతో చేసేది లేక పోలీసులు, వైసీపీ కార్యకర్తల రక్షణ మధ్య అక్కడి నుంచి బయటపడ్డారు.

అనంతరం భూముల కబ్జా ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. తాను బ్యాంకు ఉద్యోగిగా ఉన్న సమయంలో 2012లో గోమంగి మధుసూదనరావు నుంచి సర్వే నంబరు 82లో ఉన్న 5.72 ఎకరాల పట్టాభూమిని కొనుగోలు చేసినట్టు చెప్పారు. అందుకు సంబంధించిన పత్రాలు తన వద్ద ఉన్నాయన్నారు. అయితే, ఇప్పుడీ భూముల ధరలు పెరగడంతో కావాలనే తాను ఆ భూమిని కబ్జా చేసినట్టు ఆరోపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.