15 రోజుల్లోగా వలస కార్మికులను తరలించండి
ఇంకా మిగిలి ఉన్న వలసకూలీల తరలింపుకు మరో 15 రోజులు గడువు..సుప్రీం

న్యూఢిల్లీ: వలసకార్మికుల అంశంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులను 15 రోజుల్లోగా వారి వారి స్వంత రాష్ట్రాలకు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈసందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ జూన్ 3వ తేదీ నుంచి వలస కార్మికులను తరలించేందుకు ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 4228 శ్రామిక్ రైళ్లను నడిపినట్లు కోర్టుకు తెలియజేశారు. ఈ రైళ్లలో మొత్తం 57 లక్షల మందిని తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. మరో 41 లక్షల మంది రోడ్డు మార్గంలో వెళ్లినట్లు ఆయన చెప్పారు. అన్ని నగరాల నుంచి దాదాపు కోటి మంది వరకు వలస కార్మికులు తమ స్వంత రాష్ట్రాలకు వెళ్లినట్లు తుషార్ మెహతా తెలిపారు. కాగా ఇంకా మిగిలి ఉన్న వలసకూలీలను తరలించేందుకు కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు మరో 15 రోజుల సమయాన్ని కేటాయిస్తున్నట్లు కోర్టు తెలిపింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/