మహిళలు అత్యంత క్లిష్టమైన జర్నలిజం రంగంలో రాణించడం గొప్ప విషయం

హైదరాబాద్ : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టుల కోసం నిర్వహిస్తున్న రెండు రోజుల వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. మహిళలపై వివక్ష లేని రంగం అంటూ ఏదీ లేదని, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని రాణించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మహిళా జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా వర్క్ షాప్ ఏర్పాటు చేసిన అల్లం నారాయణను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్‌, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ పాల్గొన్నారు.

అనంతరం మాట్లాడుతూ.. సమాజంలో సగమై నేడు మహిళలు అన్నిరంగాల్లో దూసుకెళ్తున్నారని, అత్యంత క్లిష్టమైన జర్నలిజం రంగంలో రాణించడం గొప్ప విషయమన్నారు. అందరి కోసం ఒక వేదిక ఏర్పాటుకు కృషి చేసిన మీడియా అకాడమీని ప్రశంసిస్తూ మీడియా సెంటర్‌ ఏర్పాటుకు సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అందరూ ఐక్యమత్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. పురుషులతో సమానంగా సంపాదిస్తున్న అంతా కన్నా ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్న, చేసే పనిని నిబద్ధతతో చేస్తూ రాణిస్తూ ముందుకెళ్తున్నారన్నారు.

రాజకీయాల్లో వచ్చిన మొదట్లో తనను ‘గరిట తిప్పే వాళ్లతో ఏం అవుతుంది’ అన్న మాటలను ఛాలెంజ్‌గా తీసుకొని పని చేసినట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ ఉద్యమ కాలంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో గొప్పదని, నేడు పునర్నిర్మాణంలో సైతం పాత్ర అమోఘమని కొనియాడారు. రెండు రోజుల శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని, సీనియర్ పాత్రికేయుల అనుభవాలు తెలుసుకొని, భవిష్యత్‌లో మరింతగా రాణించాలన్నారు. దృష్టికి వచ్చిన పలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/