నేడు హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

ఈ రోజు ఖైరతాబాద్‌, సైదాబాద్‌, బోయిన్‌పల్లి, కాచిగూడలో ఉత్స‌వాలు

హైదరాబాద్ : హైద‌రాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు, ఆంక్షలు విధించారు. ప‌లు మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించడం లేదా పూర్తిగా ఆపివేస్తున్నారు. స‌ద‌ర్ ఉత్స‌వాలు జ‌రుగుతుండ‌డ‌మే ఇందుకు కార‌ణం. గ‌త రాత్రి కొన్ని ప్రాంతాల్లో సదర్‌ ఘనంగా జరిగింది. ఈ ఉత్స‌వాల్లో రెండో రోజులో భాగంగా ఈ రోజు ఖైరతాబాద్‌, సైదాబాద్‌, బోయిన్‌పల్లి, కాచిగూడ, ఈస్ట్‌ మారెడ్‌పల్లి, నారాయణగూడ వైఎంసీఏ కూడలిలో సదర్‌ ఉత్సవాలు జ‌రుగుతాయి. ఉత్స‌వాల‌కు పలువురు రాజకీయ నేతలు, ఇతర ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. నారాయణగూడ వైఎంసీఏ కూడలిలో ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఆ కూడ‌లి మీదుగా వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ట్రాఫిక్‌ పోలీసులు చెప్పారు. కాచిగూడ చౌరస్తా నుంచి నారాయణగూడ వైఎంసీఏ వైపు వాహనాల రాకపోకలు నిలిపివేస్తారు.

ఆ వాహ‌నాల‌ను కాచిగూడ టూరిస్ట్‌ హోటల్‌ వైపున‌కు మళ్లిస్తారు. రామ్‌కోఠిలోని విఠల్ వాడి చౌరస్తా నుంచి నారాయణగూడ వైఎంసీఏ వైపు వచ్చే వాహనాలను రామ్‌కోఠి కూడలి వైపు మళ్లిస్తారు. అదే విధంగా రాజ్‌మోహల్లా నుంచి వచ్చే వాహనాలను సాబూ షాప్‌ పాయింట్‌ నుంచి రామ్‌కోఠి చౌరస్తా మీదుగా మళ్లిస్తారు. ఇక‌ నారాయణగూడ రెడ్డి మహిళా క‌ళాశాల నుంచి వచ్చే వాహనాలను బర్కత్‌పుర వైపు మళ్లిస్తారు. అలాగే, బర్కత్‌పుర పాత పోస్టాఫీసు నుంచి వైఎంసీఏ వైపు వాహనాలను అనుమతించ‌రు. బర్కత్‌పుర చమాన్‌ నుంచి వైఎంసీఏ వైపు రాకపోకలను బంద్ చేస్తున్నారు. ఈ ట్రాఫిక్‌ ను బర్కత్‌పుర చౌరస్తా వైపు లేదా టూరిస్ట్‌ హోటల్‌ వైపు మళ్లిస్తారు. హైద‌రాబాద్‌లోని ఆయా ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/