రేపు కమాండ్‌‌ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్బంగా బంజారాహిల్స్‌‌లో ట్రాఫిక్ ఆంక్షలు

రేపు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కమాండ్‌‌ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం జరగబోతుంది. ఈ క్రమంలో రేపు బంజారాహిల్స్‌‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని, రోడ్డు నం.12 రూట్‌‌లో వచ్చే వెహికల్స్​ను డైవర్ట్‌‌ చేస్తునట్లు జాయింట్‌‌ సీపీ, ట్రాఫిక్ ఏవీ రంగనాథ్‌‌ తెలిపారు. ఎన్టీఆర్ భవన్ నుంచి అపోలో, ఫిలింనగర్‌‌, బంజారాహిల్స్‌‌ వైపు వెళ్లే వెహికల్స్ జూబ్లీహిల్స్ చెక్‌‌పోస్ట్‌‌, రోడ్​నం.36, 45 మీదుగా మాదాపూర్ వైపు వెళ్లాల్సి ఉంటుందన్నారు.

మాసబ్‌‌ట్యాంక్‌‌ నుంచి బంజారాహిల్స్‌‌ రోడ్​నం.12 వైపు వెళ్లే వెహికల్స్​ రోడ్​నం.1, 10 జహీరానగర్, క్యాన్సర్ హాస్పిటల్ మీదుగా వెళ్లాలి. ఫిలింనగర్‌‌‌‌ నుంచి ఒడిశా ఐస్‌‌ల్యాంగ్‌‌ వైపు వచ్చే వెహికల్స్ ​చెక్‌‌పోస్ట్‌‌, ఎన్టీఆర్‌‌ భవన్‌‌, సాగర్ సొసైటీ మీదుగా పంజాగుట్ట రూట్‌‌లో వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఇక హైదరాబాద్ నగరంలో నూతనంగా నిర్మించిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు అధికారులు. గతంలోనే దీన్ని ప్రారంభించాలని ప్లాన్ చేసినా.. పనులు పూర్తి కాకపోవడంతో.. వాయిదా పడింది. మిగిలిన పనులను పూర్తిచేసిన అధికారులు.. ఎట్టకేలకు ప్రారంభిస్తున్నారు. 2015లో కమాండ్ కంట్రోల్ సెంటర్ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఏడేళ్లు పనులు సాగాయి. వాస్తవానికి ముందుగానే పనులు పూర్తి కావాల్సింది. కానీ.. కరోనాతో రెండేళ్లు పనులు ఆగిపోయాయి. 585 కోట్ల భారీ వ్యయంతో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది.