ఆందోళనకరంగా అంజన్‌కుమార్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి ..

కరోనా మహమ్మారి ఇంకా మనుషుల ప్రాణాలు వదలడం లేదు. ఇంకా చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. మునపటి కంటే కాస్త కంట్రోల్ అయినప్పటికీ..ప్రతి రోజు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో వందల కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. నాల్గు రోజుల క్రితం కరోనా బారిన పడిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్ అపోలో ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నారు. రెండు రోజులు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని డాక్టర్స్ చెపుతుండడం తో కుటుంబ సభ్యులు , పార్టీ నేతలు , కార్యకర్తలు ఖంగారు పడుతున్నారు.

అంజన్‌కుమార్ ఆరోగ్యం బాగుండాలని అంత కోరుకుంటున్నారు. అంజన్ కుమార్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ కు ఏఐసీసీ ఇంచార్జి మానిక్కం ఠాగూర్ ఫోన్‌చేసి ప‌రామ‌ర్శించారు. భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని, అన్నివిధాలుగా కోలుకుంటార‌ని ధైర్యం చెప్పారు. అంజ‌న్‌కుమార్ కుటుంబానికి ప‌లువురు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు ఫోన్‌చేసి ప‌రామ‌ర్శిస్తున్నారు.

ఇటీవల మూడుచింతలపల్లి దళిత, గిరిజన దండోరా దీక్షలో అంజన్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ నెల 26న అంజన్‌కుమార్‌కు జలుబు, జ్వరం లక్షణాలు కనిపించాయి. దీంతో ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో అంజన్ కుమార్ యాదవ్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.