విద్యాసిద్ధిదాయిని

నేడు శ్రీపంచమి

Saraswati Devi
Saraswati Devi

సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా

మాఘ శుద్ధ పంచమి రోజున సరస్వతీ దేవి అవతరించింది. ఈ రోజును ‘శ్రీ పంచమి, వసంత పంచమి ‘మదన పంచమి.. ఇలా పలు పేర్లతో పిలుస్తారు. మాఘమాసమే అయినా వసంత శోభ మొదలవుతంది. అందుకే ‘వసంత పంచమిగా ఇది ప్రాచుర్యం పొందింది. శ్రీపంచమి రోజున సరస్వతీ మందిరాలన్నీ పిల్లల అక్షరాభాసాలతో కన్నులపండువగా ఉంటాయి.
పూర్వం.. ప్రతిరోజూ ఈ సరస్వతీ ప్రార్ధన చేసిన తరువాతే పిల్లలు చదువు మొదలుపెట్టేవారు. ఈ శ్లోకంలో ‘కామరూపిణిగా సరస్వతీదేవి అభివర్ణితమయింది. అంటే ‘కోరిన రూపాలు ధరించగలిగే శక్తి కలిగిన దేవత అని అర్థం. గాయత్రిగా, మాతంగిగా, విద్యాధిదేవతగా, వీణాపాణిగా, గీర్వాణిగా, ఇలా అనేక రూపాల్లో ఆమె దర్శనమిస్తుంది. విద్యాధిదేవత అయిన సరస్వతీ దేవికి నమస్కరిస్తూ ‘మే అంటే నాకు, ‘సదా ఎల్లప్పుడూ, విద్యా రంభం నుంచి నేను కోరుకున్న విద్యలలో ఓ ‘కామరూపిణీ (బోధారూపంలో), ‘సిద్ధిర్భవతు.. సాక్షాత్కరిస్తూ ఉండమనీ, విజయం చేకూర్చమనీ నీకు నమస్కరిస్తున్నానని తాత్పర్యం.
ఎంత శక్తిమంతమైన ప్రార్థన ఇది.
సరస్వతిని ‘ముగ్గుర్మల మూలపుటమ్మ అన్నాడు పోతనామాత్యుడు ‘సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధింయానః ప్రచోదయాత్‌ అంటూ ‘దేవీభాగవతంలో వ్యాసుడు స్తుతించాడు. సరస్వతిని ఉపాసించే వాల్మీకి రామాయణాన్నీ వ్యాసుడు మహాభారతాన్నీ, పద్దెనిమిది పురాణాలనూ రచించారు. భాగవతాన్ని పోతన ఆంధ్రీకరించాడు. సరస్వతిని ఆరాధించిన కాళిదాసుది మహాకవులు అపూర్వమైన రనలతో వాజ్మయాన్ని పరిపుష్ఠం చేశారు. పరాశక్తిలోని చైతన్య శక్తే సరస్వతి. విద్యాధిదేవతా ప్రకటితమైనప్పుడు ఆమె సరస్వతీ నామాన్ని పొందుతుంది. జ్ఞానం, విద్య, వాక్కులాంటి బుద్ధికి సంబంధించిన శక్తులన్నిటికీ ఆమె అధిష్ఠాత్రి, పరాశక్తిని శారదామాత రూపంలో దర్శించి.. సృష్టి రచనకు బ్రహ్మశ్రీకారం చుట్టాడని పురాణాలు చెబుతున్నాయి.
మేథ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ..ఇవన్నీ ధీశక్తులు, వీటన్నిటి సమాహారమే సరస్వతి. లౌకిక, విద్యలకూ, పౌరలౌకిక విద్యలకై సరస్వతి అధిష్ఠాన దేవత, బుద్ధిమాద్యం, మతిమరపు లాంటి జాడ్యాలను ఆమె తొలగిస్తుంది.
అందుకే ‘నిశ్శేష జాడ్యాపహా అని
ఆమెను కీర్తిస్తారు. ‘అబితమే, నదీతమే, దేవితమే అంటాయి శ్రుతులు. ‘నదులలో శ్రేష్టమై నదీ, దేవతలలో ఉన్నతురాలు, ముగ్గురమ్మలకు మూలమైనదీ సరస్వతి అని భావం. ‘ప్రాణశక్తీ సరస్వతీ అంటోంది వేదం. శరీరంలోని రక్తంలో అణువణువునా ప్రాణశక్తి ప్రవహిస్తోంది. ఆ శక్తే సరస్వతి ధనప్రదాయినిగా, అన్నప్రదాయినిగా, జ్ఞానప్రదాయినిగా సరస్వతిని వేదాలు, ఉపనిషత్తులు కొనియాడాయి. యజ్ఞవల్క్యుడు సూర్యుడి సూచన మేరు సరస్వతిని ఉపాసించి, స్మృతి శక్తిని పొంది, విద్యాసుడయ్యాడు. ‘యా బ్రహ్మాచ్యుత శంకరంః ప్రభృతిభిః దేవైః సదాపూజితా.. సమస్త దేవతలూ ఆరాధించే శారదామాతను అది శంకరులు తన హృదయంలో ప్రతిష్టించుకొని అపారమైన వాజ్మమాన్ని సృష్టించారు. అద్వైతత్తత్వసారాన్ని ప్రబోధించారు. ‘విద్య వల్ల వినయం
అనే సుగుణం కలుగుతుంది. దాని ద్వారా సమాజంలో గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు ఉంటే ఐశ్వర్యం తనకు
తానే వరిస్తుంది. వినయానికీ, ధర్మానికీ కట్టుబడితే ఇహ, పరలోకాలలో సుఖాలు ప్రాప్తిస్తాయి అంటాడు భర్త్మహరి.
ఆ సరస్వతిని విద్యాప్రదాత్రిగా పూజించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం మనదేశంలో .. కశ్మీరులో శారదామాత ఆలయం, కర్ణాటకలోని శృంగేరి పీఠంలోని శారదాంబ ఆలయం, తెలుగునాట భాసర క్షేత్రంలో జ్ఞాన సరస్వతి ఆలయం, కొలనుపాకలో కొలను భారతి ఆలయం ప్రసిద్ధి చెందాయి. ఇవే కాకుండా, అనేక ప్రాంతాల్లో, ప్రధాన ఆలయాల్లో ఉపాలయాలుగానూ
సరస్వతీ మందిరాలు ఉన్నాయి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/