సీఎం జగన్ నివాసం వ‌ద్ద ఆందోళ‌న‌

డ్రోన్ కెమెరాతో భ‌ద్ర‌త‌.. ప‌లువురి అరెస్టు

అమరావతి : ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌ను నిరసిస్తూ తాడేపల్లిలోని సీఎం జగన్ అధికారిక‌ నివాసం వ‌ద్ద టీడీపీ అనుబంధ విభాగాలు, ప‌లు సంఘాల విద్యార్థులు ఆందోళన చేప‌ట్ట‌డంతో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ‘చలో తాడేపల్లి’ కార్యక్ర‌మానికి పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ పెద్ద ఎత్తున నిరుద్యోగ యువ‌త అక్క‌డ‌కు చేరుకుంటున్నారు. దీంతో పాత టోల్‌గేట్ చౌర‌స్తా వద్ద వారిని పోలీసులు అడ్డుకుంటుండ‌డంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం జ‌రిగింది.

ప‌లువురిని పోలీసులు అరెస్టు చేసి అక్క‌డి నుంచి త‌ర‌లించారు. ముఖ్య‌మంత్రి నివాసానికి వెళ్లే మార్గంలో ముగ్గురు ఎస్పీలు, డీఎస్పీలతో పాటు దాదాపు 1,000 మంది పోలీసులు మోహరించారు. నిన్న‌టి నుంచే పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ విద్యార్థులు వాటిని లెక్క‌చేయ‌కుండా తాడేప‌ల్లి వ‌చ్చారు. గుంటూరు జిల్లాకు వస్తున్న వారిని గుర్తించ‌డానికి పోలీసులు డ్రోన్‌ కెమెరా వాడుతున్నారు. జాబ్‌ క్యాలెండర్ లో అతి త‌క్కువ ఉద్యోగాలు పేర్కొన‌డం ఏంట‌ని విద్యార్థులు మండిప‌డుతున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/