ఎస్వీ పురం టోల్ ప్లాజా వద్ద విద్యార్థుల వీరంగం

ఎస్వీ పురం టోల్ ప్లాజా వద్ద తమిళనాడుకు చెందిన ఓ న్యాయ కళాశాల విద్యార్థులు వీరంగం సృష్టించారు. తిరుపతి వెళ్లి వస్తున్న విద్యార్థుల కారును టోల్ ప్లాజా వద్ద సిబ్బంది ఆపారు. టోల్ ఫీజు చెల్లించాలని కోరడంతో వారు దురుసుగా ప్రవర్తించారు. కారులోని న్యాయ విద్యార్థి సిబ్బందిలో ఒకరితో గొడవపడ్డాడు. ఫాస్టాగ్ పనిచేయడం లేదని, కనుక భౌతికంగా ఫీజు చెల్లించాలని కోరారు. అందుకు న్యాయ విద్యార్థి తిరస్కరించాడు. దాంతో అది గొడవకు దారి తీసింది.

దీంతో కారులోని వారు కిందకు దిగి సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. వెంటనే ఫీజు చెల్లించి వెనుక ఉన్న వాహనాలకు దారి ఇవ్వాలని కోరారు. దానికి వారు అంగీకరించకపోగా, కేవలం తమిళనాడు రిజిస్ట్రేషన్ తో ఉన్న వాహనాలకు దారి ఇచ్చి, ఏపీ రిజిస్ట్రేషన్ వాహనాలను అడ్డుకున్నారు. తమిళనాడు విద్యార్థులు 100 మందికి పైగా ఉండడంతో వారిని నిలువరించడం కష్టమైంది.