హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

తెల్లారింది..వారి జీవితాలు తెల్లారిపోయాయి..కూలి పనుల కోసం బయలుదేరిన వారు ఇక తిరిగిరాని లోకానికి వెళ్లారు. హన్మకొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళా కూలీలు కన్నుమూశారు. శాయంపేట మండలంలోని మాందారిపేట వద్ద శుక్రవారం తెల్లవారుజామున కూలీలతో వెళ్తున్న ఆటో ట్రాలీను ఇసుక లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో 14 మంది గాయపడ్డారు. వీరిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.

బాధితులంతా పత్తిపాక గ్రామానికి చెందినవారని వెల్లడించారు. ప్రమాద సమయంలో ఆటోలో 25 మంది మహిళా కూలీలు ఉన్నారని చెప్పారు. వారంతా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో మిర్చి తోట ఏరడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతులు రేణుక, మంజుల, నిర్మలగా గుర్తించారు. ఈ ప్రమాదంలో శరీర అవయవాలు తెగి రోడ్డుమీద పడ్డాయి. ఈఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.