ములుగు జిల్లాలో పాఠశాల భవనం పైకప్పు కూలి ముగ్గురు విద్యార్థులకు గాయాలు

కేసీఆర్ పాలనలో విద్యావ్యవస్థ నాశనం అవుతుందనే విమర్శల నేపథ్యంలో ములుగు జిల్లాలో పాఠశాల భవనం పైకప్పు కూలి ముగ్గురు విద్యార్థులకు గాయాలు కావడం ఇప్పుడు ప్రభుత్వం ఫై మరింత విమర్శలకు దారితీస్తుంది. వెంకటాపురం మండలం ఎదిర గ్రామంలో ప్రాథమిక పాఠశాల పైకప్పు కూలింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన విద్యార్థులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థులకు ఎలాంటి ప్రాణాపాయం లేనట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పాఠశాలలో ఉన్న ఒక భవనం పైకప్పుపై నిర్మించిన గోడ కూలింది. మధ్యాహ్నం భోజనం చేశాక ఒకటో తరగతి విద్యార్థి సంతోశ్, రెండో తరగతి విద్యార్థిని విషిత, మూడో తరగతి విద్యార్థి నికిత భవనం పక్క నుంచి పోతుండగా ఒక్కసారిగా పైకప్పు కూలడంతో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిని ఏటూరునాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. పాఠశాలలు ప్రారంభమై మూడు నెలలైనా శిథిలావస్థకు చేరుకున్న వాటి పట్ల ప్రభుత్వం దృష్టి సారించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.