మందు తాగేవాళ్లని భారతీయులుగా గుర్తించను : సీఎం నితీశ్ కుమార్

కల్తీ మద్యం మృతుల పట్ల ప్రభత్వం బాధ్యత తీసుకోదు

బీహార్ : బీహార్ లో మద్య నిషేధం అమల్లో ఉన్నప్పటికీ కల్తీ మద్యం, కల్తీ సారాయి విరివిగా దొరుకుతున్నాయి. ఈ కల్తీ మద్యం వల్ల అక్కడ అనేక విషాదకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. మందు తాగేవాళ్లంతా మహా పాపులు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కల్తీ మద్యం, సారాయి తాగడం వల్ల మృతి చెందే వారి పట్ల ప్రభుత్వం ఎలాంటి బాధ్యత తీసుకోదని, వారి కుటుంబాలకు ఎలాంటి సాయం అందజేయదని స్పష్టం చేశారు.

మహాత్మా గాంధీ కూడా మద్యం సేవించడాన్ని వ్యతిరేకించారని… ఆయన సిద్ధాంతాలను పట్టించుకోకుండా మందు తాగుతున్నవారు ముమ్మాటికీ మహా పాపులేనని నితీశ్ అన్నారు. ఇలాంటి వాళ్లను తాను భారతీయులుగా గుర్తించనని చెప్పారు. మందు తాగడం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా చాలా మంది దాన్ని సేవిస్తున్నారని… దీని వల్ల జరిగే పర్యవసానాలకు వారే బాధ్యులని తెలిపారు. మందు విషంతో సమానమని తెలిసినా తాగుతున్నారని మండిపడ్డారు. మరోవైపు నితీశ్ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మద్య నిషేధాన్ని అమలు చేయడంలో నితీశ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని విమర్శిస్తున్నాయి.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/