కేంద్ర మంత్రి ఓ నేరస్థుడు.. రాహుల్ గాంధీ

లఖింపూర్ ఖేరి ఘటనపై రాహుల్ మండిపాటు

న్యూఢిల్లీ: లఖింపూర్ ఖేరి ఘటనపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా ఓ నేరస్థుడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లోక్ సభ సమావేశాల్లో లఖింపూర్ ఖేరి ఘటనపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. కుట్ర ప్రకారం చేసిన దాడి అంటూ సిట్ అధికారులు నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల అరుపులతో సభ మొత్తం దద్దరిల్లింది. దీంతో సభను స్పీకర్ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు.

అనంతరం పార్లమెంట్ లో రాహుల్ మీడియాతోనూ మాట్లాడారు. లఖింపూర్ ఖేరి ఘటన ఓ కుట్రంటూ నివేదిక ఇచ్చారని, కచ్చితంగా అది కుట్రేనని ఆయన అన్నారు. ఎవరి కుమారుడికి ఆ ఘటనలో హస్తం ఉందో అందరికీ తెలుసన్నారు. దానిపై పార్లమెంట్ లో సమగ్ర చర్చ జరగాల్సిందే. కానీ, అందుకు ప్రధాని ఒప్పుకోవడం లేదు. మంత్రిని వెనకేసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఏడాది అక్టోబర్ లో ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరిలో రైతులపైకి మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్ లోని కారు ఎక్కించడంతో నలుగురు చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటన సమయంలో కాన్వాయ్ లో అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కారులో ఉన్నారన్న ఆరోపణలు వచ్చాయి.ఆ తర్వాత రైతులు చేసిన దాడిలో మరో నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ కేసులో ఇప్పటికే ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/