పీఓకే ను స్వాధీనం చేసుకోవడం మన బాధ్యతః మాజీ సీఎం హరీశ్ రావత్

పాక్ ప్రస్తుతం బలహీన పరిస్థితిలో ఉందని వ్యాఖ్య

this-is-right-time-to-get-back-pok-says-harish-rawat

న్యూఢిల్లీః పాకిస్థాన్ ప్రస్తుతం బలహీన పరిస్థితిలో ఉందని… పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)ను స్వాధీనం చేసుకోవడానికి ఇదే సరైన సమయమని కాంగ్రెస్ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ అన్నారు. పీఓకేను స్వాధీనం చేసుకోవడం మన బాధ్యత అని చెప్పారు. పీఓకేను పాకిస్థాన్ అక్రమంగా స్వాధీనం చేసుకుందని… దానికి స్వేచ్ఛను కల్పించి, తిరిగి తీసుకోవడం మన బాధ్యత అని అన్నారు.

పీఓకేను మళ్లీ తీసుకోవాలనే బిల్లును కాంగ్రెస్ హయాంలో పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించిందని చెప్పారు. పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోవడం మోడీ ప్రభుత్వ అజెండాలో ఒక భాగమని తాను నమ్ముతున్నానని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం చర్చలకు మాత్రమే పరిమితం కాకూడదని వ్యాఖ్యానించారు.

మరోవైపు, పీఓకేను స్వాధీనం చేసుకోవాలనే ఇండియా లక్ష్యం ఎప్పటికీ నెరవేరదని ఇటీవలే పాక్ ఆర్మీ చీఫ్ గా బాధ్యతలను చేపట్టిన జనరల్ సయ్యద్ అసిమ్ మునిర్ తెలిపారు. దేశాన్ని కాపాడుకునేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. ఈ క్రమంలో హరీశ్ రావత్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/