కాంగ్రెస్‌లోకి ప్రశాంత్‌కిషోర్‌ ఎవరికీ ఎలాంటి సమస్య లేదు: దిగ్విజయ్‌సింగ్‌

కాంగ్రెస్ గురించి పీకే ఇచ్చిన ప్రజెంటేషన్ బాగుంది..దిగ్విజయ్ సింగ్

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిశోర్ చేరబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన సోనియాగాంధీతో వరుస భేటీలు నిర్వహించారు. మరోవైపు పీకేను పార్టీలో చేర్చుకోవడం కొందరు నేతలకు ఇష్టం లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోకాంగ్రెస్ సీనియ‌ర్ నేత దిగ్విజ‌య్ సింగ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పై ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన ప్రజెంటేషన్ బాగుందని చెప్పారు. పార్టీలోకి ఆయన రాకపై ఎవరికీ అభ్యంతరం లేదని అన్నారు. పీకే చెప్పింది పూర్తిగా కొత్తేమీ కాదని, తమకు తెలియంది కూడా కాదని చెప్పారు. అయితే సమస్యను నీవు ఏ విధంగా వివరించావు, దాన్ని పార్టీ ఎలా స్వీకరించింది అనేదే ప్రధానమని అన్నారు.

ప్రశాంత్ కిశోర్ తో తనకు మంచి బంధం ఉందని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ఆయనతో గతంలో చాలా లోతుగా చర్చలు జరిపానని తెలిపారు. ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి ఆయన ప్రయాణం సాగుతుంటుందని చెప్పారు. ఆయనకు ప్రత్యేకంగా ఒక పార్టీకి సంబంధించి కమిట్ మెంట్ ఉండదని అన్నారు. అయితే ఇప్పుడు ఆయన పక్కా వ్యూహాలతో తమ వద్దకు వచ్చారని, ఇది మంచి విషయమని చెప్పారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/