కొండగట్టు అంజన్న బంగారాన్ని ఎత్తుకెళ్లిన దొంగలు అరెస్ట్..

రెండు రోజుల క్రితం ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న స్వామి దేవాలయంలో దొంగలు పడిన సంగతి తెలిసిందే. సుమారు 15 కేజీల వెండి , బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. స్వామి వారి 2 కేజీల మకర తోరణం , అర్థమండంలోని స్వామి వారి 5 కేజీల వెండి ఫ్రెమ్, 3 కేజీల నాల్గు శఠగోపాలు , స్వామి వారి 5 కేజీల తొడుగు ఇలా మొత్తంగా 15 కేజీల వెండి వరకు చోరీ అయ్యినట్లు ఆలయ అధికారులు గుర్తించారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు..దొంగలను కర్ణాటకలోని బీదర్‌ ప్రాంతంలో పట్టుకున్నట్లు సమాచారం. వారి వద్ద నుండి 60 శాతం చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది.

ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జగిత్యాల పోలీసులు ఒకటి, రెండు రోజుల్లో వెల్లడించే అవకాశం ఉంది. కాగా దొంగతనానికి సంబంధించి దేవస్థానం అధికారులు ఇప్పటికే ఇద్దరు ఉద్యోగులపై వేటు వేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకే వారిని సస్పెండ్‌ చేసినట్టు- దేవస్థానం అధికారులు వివరించారు