చందానగర్లోని సిగరెట్ల గోదాములో చోరీ
రూ. 60 లక్షల విలువైన సిగరెట్లను దొంగిలించిన దుండగులు

హైదరాబాద్: నగరంలో వినూత్నంగా దొంగలు సిగరెట్లను ఎత్తుకెళ్లారు. చోరీకి గురైన సొత్తు విలువ రూ. 60 లక్షలు ఉంటుందని పోలీసలు తెలిపారు. వివరాలోకెళితే.. హైదరాబాద్లోని చందానగర్ లో శ్రీదేవి థియేటర్ రోడ్డులో పద్మజ కాలనీలో ఓ ఐదంస్తుల భవనం ఉంది. దానిలో ఓ సిగరెట్ల గోదాము ఉంది. ఇదే భవనంలో ఒకటి నుంచి మూడు అంతస్తుల్లో ఓ పాఠశాల నడుస్తుండగా, గ్రౌండ్ ఫ్లోర్లో సిగరెట్ల హోల్సేల్ వ్యాపారం నడుస్తోంది. వీరి సిగరెట్ల గోదాము కూడా ఇదే భవనంలో నాలుగో అంతస్తులో ఉంది. అయితే ఎప్పటిలాగే విధుల్లోకి వచ్చిన సిబ్బంది తాళాలు పగులగొట్టి ఉండడం చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి సీసీ కెమెరాల ఫుటేజీని చూడగా ముందురోజు రాత్రి నలుగురు దొంగలు ముసుగులతో ఓ వ్యానులో వచ్చారు. గోదాములోకి వెళ్లి, అక్కడున్న ఇనుప జాలీని గడ్డపార తో తొలగించి గోదాము లోపలికి ప్రవేశించారు. అంతేకాకుండా సీసీ కెమెరాలకు సంబంధించిన కేబుల్లను కట్ చేశారు. గోదాములో మొత్తం రూ. 6 కోట్ల సరుకు ఉండగా అందులోంచి 60 కార్టన్లను దొంగలు ఎత్తుకెళ్లారు. చోరీకి గురైన సొత్తు విలువ రూ. 60 లక్షలు వరకు ఉంటుందని పోలీసుల అంచనా వేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/