ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ షురూ

రాష్ట్ర సర్కార్ ప్రభుత్వ ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇందులో భాగంగానే గ్రేడ్-2 హెడ్ మాస్టర్లు, టీచర్లకు బదిలీల షెడ్యూల్ విడుదల చేశారు. ఒకే చోట ఐదేళ్లు పూర్తి చేసుకున్న హెడ్ మాస్టర్లకు, ఎనిమిదేళ్ల పూర్తి చేసుకున్న టీచర్లకు బదిలీ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్‌ 12వ తేదీని నుంచి బదిలీల ప్రక్రియ ఆన్‌లైన్‌ ప్రారంభం కానుంది. జనవరి 12వ తేదీన బదిలీలకు సంబంధించిన తుది జాబితాను విడుదల చేస్తారు.

రాష్ట్రంలోని హైస్కూళ్లు, ప్రాథమిక పాఠశాలల్లో వివిధ సబ్జెక్టులకు ఉపాధ్యాయుల నియామకం కోసం ఈ బదిలీలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. 3 నుంచి 10వ తరగతులకు 7,928 సబ్జెక్టు టీచర్లు అదనంగా కావాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. సబ్జెక్టు టీచర్లు అందుబాటులో లేకపోతే అర్హత కలిగిన ఎస్జీటీలను స్కూల్ అసిస్టెంట్లుగా నియమించనున్నారు. మిగిలిన ఎస్జీటీలను ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి బదిలీ చేయనున్నారు.

అయితే, బదిలీల కారణంగా 2022-23 విద్యాసంవత్సరం ఒడిదుడుకులకు లోనవకుండా చూడాలని పాఠశాల విద్యాశాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఉన్నతాధికారులతో రెండ్రోజుల పాటు సమావేశాలు నిర్వహించిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టీచర్ల బదిలీలకు ఆమోదం తెలిపారు.