శరణార్థుల కోసమే కొత్త చట్టం తీసుకొచ్చాం

మనదేశం సర్వ మతాల కలయికల సెక్యులర్‌ దేశం

G. Kishan Reddy
G. Kishan Reddy

హైదరాబాద్‌: బంగ్లాదేశ్‌లో జరుగుతున్న దాడుల కారణంగా భారత్‌లోకి శరణార్థులు వస్తున్నారని, ఇలాంటి వారికోసం మాత్రమే కొత్త చట్టం తీసుకొచ్చామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బిజెపి నేత జి.కిషన్‌ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌లోని పద్మరావునగర్‌లో బిజెపి నేతలు ఆదివారం గృహ సంపర్క్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి కిషన్‌ రెడ్డితో పాటు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కె లక్ష్మణ్‌ పాల్గొన్నారు. పౌరసత్వ సవరణ చట్టం సీఏఏ జాతీయ పౌర పట్టిక ఎన్నార్సీ చట్టాలపై ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ ఇస్లామిక్‌ దేశాలని అన్నారు. మన దేశం సర్వ మతాల కలయిక సెక్యులర్‌ దేశమని అన్నారు. కాగా శరణార్థులను ఆదుకోవడం వారికి రక్షణ కల్పించడం కోసం వారికి పౌరసత్వం ఇవ్వాలని బిజెపి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కానీ దీన్ని కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ మజ్లిస్‌ పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వల్ల ముస్లింలకు అన్యాయం జరిగనట్టు ఆకాశం ఊడిపడినట్టు భూమి బద్దలైనట్టు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/