టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడి ఆరోగ్య పరిస్థితి మరింత విషమం

టీటీడీ ఈవో ధ‌ర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి (శివ) గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంద్రమౌళి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చంద్రమౌళికి ఇటీవలే టీటీడీ చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షుడు ఏజే శేఖర్ రెడ్డి కుమార్తెతో నిశ్చితార్థం జరిగింది.

జనవరిలో వీరి వివాహం తిరుమలలో జరగాల్సి ఉంది. చంద్రమౌళి ముంబై లో ఉద్యోగం చేస్తున్నారని, సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రెండు కుటుంబాల వారు పెళ్లికి శుభలేఖలు పంచుతున్నారు. చెన్నై అల్వారుపేటలోని బంధువులకు ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి చంద్రమౌళి ఆదివారం మధ్యాహ్నం కారులో వెళ్లారు. అయితే కొద్దిసేపటికే గుండె నొప్పిగా ఉందని చెప్పడంతో పక్కనే ఉన్న స్నేహితుడు వెంటనే సమీపంలోని కావేరి ఆసుపత్రిలో చేర్పించారు.

ఇక చంద్రమౌళి ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అరవిందన్‌ సెల్వరాజ్‌ బులిటెన్ విడుదల చేశారు. చంద్రమౌళికి ఆదివారం హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేరారని.. వెంటనే కార్డియో పల్మనరీ రిససిటేషన్‌ (సీపీఆర్‌) ప్రారంభించామన్నారు. చంద్రమౌళికి ‘ఎక్మో’పై చికిత్స అందిస్తున్నామన్నారు. నిపుణుల పర్యవేక్షణలో ఆయనకు వైద్యం కొనసాగుతోందన్నారు. కష్టకాలంలో తమ ఆలోచనలు, ప్రార్థనలు చంద్రమౌళిరెడ్డి కుటుంబ సభ్యులు, స్నేహితుల వెన్నంటి ఉంటాయి అన్నారు.