హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించిన సీపీఎం

అర్హులైన పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ బుధువారం సీపీఎం ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించారు. ఈ ముట్టడిలో వందలాది మంది కార్య కర్తలు పాల్గొన్నారు. గుడిసె వాసులతో భారీ ఎత్తున ధర్నా నిర్వహించి, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. రోడ్డు పై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు.

సుమారు రెండు గంటల పాటు ధర్నా సాగడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను మార్గమధ్యలో ఆలేరు, జనగాం ప్రాంతంలో అరెస్టు చేసి పాలకుర్తి పోలీసు స్టేషన్ కు పోలీసులు తరలించినట్లు సమాచారం. ఈ ధర్నాలో సీపీఎం జిల్లా కన్వీనర్ బొట్ల చక్రపాణి, నాయకులు చుక్కయ్య, ఉప్పలయ్య, మంద సంపత్, కిశోర్, రాగుల రమేష్, దొగ్గెల తిరుపతి, వీరన్న, గుడిసె వాసులు పాల్గొన్నారు.