ఏపీ హైకోర్టు తరలింపుపై కేంద్రం క్లారిటీ

ఏపీ హైకోర్టు తరలింపు అంశం గత కొద్దీ నెలలుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ హైకోర్టు ను కర్నూలుకు తరలిస్తామని ప్రభుత్వం చెపుతుంటే..ప్రస్తుతం దీనిపై కోర్ట్ లో విచారణ నడుస్తుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ వేదికగా కేంద్రం క్లారిటీ ఇచ్చింది. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది.

హైకోర్టును కర్నూల్‌ కు తరలిచాలంటే హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం కలిసే నిర్ణయం తీసుకోవాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపు ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉందని పేర్కొన్నారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్ర హైకోర్టు అమరావతి లో ఏర్పాటైందన్నారు. రాజ్యాంగంలోని 214 నిబంధన ప్రకారం 2018లో కేంద్రం వర్సెస్ దన్ గోపాల్ రావు, ఇతరుల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం అమరావతిలో ఏపీ హైకోర్టు ఏర్పాటు అయిందని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ కు ఉమ్మడి హైకోర్టుగా ఉన్న అప్పటి హైదరాబాద్ హైకోర్టు, అప్పటి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ హైకోర్టు అమరావతిలో ఏర్పాటయిందన్నారు.