రిలయెన్స్ నావల్ కాంట్రాక్ట్ రద్దు
అనిల్ అంబానీకి మరో భారీ ఎదురుదెబ్బ
ఆర్థిక కష్టాలతో విలవిల్లాడుతున్న ఒకనాటి సంపన్నుడు అనిల్ అంబానీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
రిలయన్స్ అండ్ నావల్ ఇంజనీరింగ్ లిమిటెడ్కు ఎన్పీవోవీ (సముద్ర తీర గస్తీ నౌక) ఒప్పందాన్ని భారత నేవీ రద్దు చేసింది.
రూ.2,500 కోట్ల విలువైన ఈ ఒప్పందం రద్దయిందని ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు వెల్లడించాయి.
2011లో జరిగిన ఈ ఒప్పందం ప్రకారం రిలయన్స్ నావల్ మొత్తం ఐదు యుద్ధ నౌకలను తయారు చేసి ఇండియన్ నేవీకి అప్పగించాల్సి ఉంది.
కానీ ఇప్పటివరకు నౌకలను అందించకపోవడంతో ఈ ఒప్పందాన్ని నేవీ రద్దు చేసిందని ఆయా వర్గాలు వివరించాయి.
గుజరాత్ కేంద్రంగా పనిచేస్తున్న పివవావ్ డిఫెన్స్ అండ్ ఆఫ్షోర్ ఇంజనీరింగ్ లిమిటెడ్ షిప్యార్డ్ను రిలయన్స్ గ్రూప్ సొంతం చేసుకోవడానికి ముందు ఈ ఒప్పందం జరిగింది.
ఆ తర్వాత 2015లో పివవావ్ డిఫెన్స్ అండ్ ఆఫ్షోర్ ఇంజనీరింగ్ లిమిటెడ్ను రిలయన్స్ అండ్ నావల్ ఇంజనీరింగ్ లిమిటెడ్గా రిలయన్స్ గ్రూప్ మార్పు చేసింది.
ఈ పరిణామంపై స్పందించేందుకు ఆర్ఎన్ఈఎల్ నిరాకరించింది.
తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/