అంతర్వేదిలో ఉద్రిక్తత పరిస్థితి

మంత్రులను నిలదీసిన హిందూ సంఘాలు

Antarvedi

అంతర్వేది: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీనరసింహ స్వామి రథం దగ్ధమైన విషయంపై హందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ ఘటనపై ఏపి మంత్రులు అంతర్వేదిలో పర్యటించారు. దీంతో ప్రముఖ హిందూ సంఘాలు వీహెచ్ పీ, భజరంగ్ దళ్ తమ ఆగ్రహాన్ని రుచిచూపాయి. అంతర్వేది వచ్చిన మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, పినిపె విశ్వరూప్ తదితరులను వీహెచ్ పీ, భజరంగ్ దళ్ నిలదీశాయి.

దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. హిందూ సంఘాల కార్యకర్తలను నిలువరించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా పోలీసులకు, వీహెచ్ పీ, భజరంగ్ దళ్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను కూడా తోసుకుని హిందూ సంఘాల కార్యకర్తలు ముందుకు దూసుకువచ్చారు. ఈ సందర్భంగా ఏపీ మంత్రులు ఈ నెల 15 లోపు పకడ్బందీ విచారణ జరిపి దోషులను పట్టుకుంటామని హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీనికి హిందూ సంఘాలు బదులిస్తూ, ఈ నెల 15 లోపు బాధ్యులను పట్టుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాయి. రథం అగ్నికి ఆహుతి కావడం వెనుక కుట్ర ఉందని వీహెచ్ పీ, భజరంగ్ దళ్ ఆరోపిస్తున్నాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/