హన్మకొండ బిజెపి కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత..

హన్మకొండ బిజెపి ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు బిజెపి ఆఫీస్ వద్ద ధర్నాకు దిగారు. దీంతో అక్కడికి చేరుకున్న బీజేపీ నేతలు ..కాంగ్రెస్ నేతలను అడ్డుకోవడం తో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగింది. దీంతో ఆగ్రహించిన బిజెపి నేతలు కాంగ్రెస్‌ నేతల వాహనాలపై దాడి చేశారు. ఇరువర్గాల పరస్పర దాడులతో బిజెపి ఆఫీస్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.

ఈ క్రమంలో సీఐ దయాకర్​కు గాయాలయ్యాయి. ఆయనను ఆసుపత్రికి తరలించారు. దాడిలో పలు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు బిజెపి కార్యాలయం వద్దకు వచ్చి కాంగ్రెస్‌ శ్రేణులు నిరసనకు దిగడాన్ని ఆ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ దాడి వెనక టిఆర్ఎస్ హస్తముందని బిజెపి జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆరోపించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆమె తెలిపారు.