బండి సంజ‌య్ పాద‌యాత్ర‌లో ఉద్రిక‌త్త

టీఆర్ఎస్ కార్య‌కర్త‌లు పాదయాత్రకు అడ్డు వెళ్లే ప్రయత్నం
టీఆర్ఎస్ కార్యకర్తల వైపున‌కు దూసుకెళ్లిన‌ బీజేపీ కార్య‌క‌ర్త‌లు

హైదరాబాద్: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ రెండో ద‌శ‌ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇటిక్యాల మండలం వేములలో ఆయ‌న ప‌ర్య‌టించారు. అక్క‌డ ప్రసంగించిన అనంతరం సంజ‌య్‌ తన పాదయాత్రను మ‌ళ్లీ ప్రారంభించ‌గా, కొంత మంది టీఆర్ఎస్ కార్య‌కర్త‌లు పాదయాత్రకు అడ్డు వెళ్లే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెల‌కొంది. టీఆర్ఎస్ కార్యకర్తల వైపున‌కు బీజేపీ కార్య‌క‌ర్త‌లు దూసుకెళ్లారు. వెంట‌నే పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకుని, వారిని అక్క‌డి నుంచి తీసుకెళ్లారు. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. అక్క‌డే ఉన్న బీజేపీ నాయ‌కురాలు డీకే అరుణ త‌మ‌ పార్టీ కార్యకర్తలకు నచ్చజెప్పి శాంతింప‌జేశారు. అనంత‌రం సంజ‌య్ పాద‌యాత్ర కొన‌సాగింది.

అంత‌కు ముందు వేములలో బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు కేసీఆర్ ఇచ్చిన హామీలేవీ ఇంతవరకూ నెరవేర్చలేకపోయారని విమ‌ర్శించారు. నీళ్లు, నియామకాల విషయంలోనూ కేసీఆర్ మాట తప్పారని చెప్పారు. త‌మ త‌ప్పుల‌ను క‌ప్పిపుచ్చుకోవ‌డానికి కేంద్ర ప్రభుత్వాంపై కేసీఆర్ ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఆయ‌న తెలిపారు. కేసీఆర్ ఎన్నికల్లో గెలిస్తే గద్వాల జిల్లాకు నీళ్లిస్తామని చెప్పార‌ని, ఆ హామీ నెరవే‌ర్చ‌లేద‌ని చెప్పారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/