బెజోస్ భూమిపైకి రానివ్వొద్దంటూ వేలాదిమంది సంతకాలు
వచ్చే నెల 20న సోదరుడితో కలిసి బెజోస్ అంతరిక్ష యాత్ర
వాషింగ్టన్: అమెజాన్ అధినేత, బిలియనీర్ జెఫ్ బెజోస్ తన సోదరుడితో కలిసి అంతరిక్షంలోకి వెళ్తున్నట్లు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన ‘బ్లూ ఆరిజిన్’ అనే కంపెనీని కూడా ఎప్పుడో స్థాపించారు. ఇది ఒక స్పేస్ ఎక్స్ప్లొరేషన్ సంస్థ. ఇది తయారు చేసిన ‘న్యూ షెపర్డ్’ అనే రాకెట్లో తాను, తన సోదరుడు మార్క్ బెజోస్ కలిసి అంతరిక్షంలోకి వెళ్లబోతున్నట్లు తాజాగా జెఫ్ బెజోస్ ప్రకటించారు.
అయితే, ఈ యాత్రపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బెజోస్ కనుక అంతరిక్షంలోకి వెళ్తే తిరిగి భూమ్మీదకు రావడానికి వీల్లేదంటూ ఓ వింత పిటిషన్ ఆన్లైన్కెక్కింది. దీనిపై నిన్నటి వరకు 33 వేల మందికిపైగా సంతకాలు చేశారు. బెజోస్ అంతరిక్ష యాత్రకు సంబంధించి అనేక పిటిషన్లు ఉన్నప్పటికీ ఆయన మళ్లీ భూమిపైకి రాకూడదన్న పిటిషన్పైనే ఎక్కువమంది సంతకాలు చేశారు. ‘బిలియనీర్లు ఉండకూడదు’ అనే అంశాన్ని ఈ పిటిషన్లో ప్రధానంగా ప్రస్తావించడం గమనార్హం
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/