పుకార్లను నమ్మవద్దు..తెలుగు ఇంజినీర్లు
తమను ఎవరూ బంధించలేదంటూ చైనా నుంచి సెల్ఫీ వీడియో పంపిన తెలుగు ఇంజినీర్లు
చైనా: చైనాతో పాటు కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. నేపథ్యంలో అక్కడున్న తెలుగు ఇంజినీర్ల పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. చైనాలోని వుహాన్ నగరంలో పదుల సంఖ్యలో తెలుగు ఇంజినీర్లు చిక్కుకుపోయారు. వారిని చైనా ప్రభుత్వం భారత్ కు రానివ్వకుండా అడ్డుకుంటోందని, వారిని నిర్బంధించారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో చైనా నుంచి తెలుగు ఇంజినీర్లు ఓ సెల్ఫీ వీడియో ద్వారా సందేశం పంపారు. తాము క్షేమంగానే ఉన్నామని, తమను ఎవరూ బంధించలేదని ఆ వీడియోలో స్పష్టం చేశారు. క్రమం తప్పకుండా తమకు ఆహారం, మంచినీరు అందిస్తున్నారని, తమకు ప్రతిరోజూ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. తాము పనిచేస్తున్న కంపెనీ వర్గాలు తమను బాగా చూసుకుంటున్నాయని వివరించారు. తమ విషయంలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. బీజింగ్ లో ఉన్న భారత దౌత్య కార్యాలయంతో మాట్లాడామని, త్వరలోనే స్వదేశానికి వచ్చేస్తామని తెలిపారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/