నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు
హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ గడువు మంగళవారంతో ముగిసింది. మొత్తం 120 పురపాలికలు, 9 నగర పాలిక సంస్థల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. ఈ రోజు సాయంత్రం ఎన్నికల బరిలోకి దిగనున్న వారి జాబితాను అధికారికంగా ప్రకటించనున్నారు. మరోవైపు కరీంనగర్లో ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఆదేశాల కారణంగా అక్కడ ఎన్నికలు ఆలస్యంగా జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా అక్కడ కూడా బీ-ఫారాలు అందజేసే గడువు కూడా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. కాగా కరీంనగర్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈ నెల 16 తో ముగియనుంది. కాగా అన్ని చోట్లా స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నెల 22న జరుతాయి, 25 ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అయితే ఒక్క కరీంనగర్లో మాత్రం ఈ నెల 25 పోలింగ్, 27న ఓట్ల లెక్కింపు చేపడతారు.
మరోవైపు పోలింగ్ కేంద్రాలను కూడా ఎన్నికల సంఘం విడుదల చేసింది. నిజామాబాద్లో 411, కరీంనగర్లో 348, రామగుండంలో 242, బండ్లగూడ జాగీర్లో 85 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పురపాలక సంస్థల్లో అత్యధికంగా మహబూబ్నగర్ 240, ఆదిలాబాద్ 183, నల్లగొండ 180, సూర్యాపేట 146, మిర్యాలగూడ 144 పోలింగ్ కేంద్రాలున్నాయి. డోర్నకల్, వర్ధన్నపేట, కొత్తపల్లి, ధర్మపురిలో 15 చొప్పున పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/