శంషాబాద్లో అతిపెద్ద మెడిటేషన్ సెంటర్ ప్రాంరభం
శంషాబాద్ : పప్రంచంలోనే అతి పెద్ద ధ్యాన కేంద్రానికి శంషాబాద్ వేదికైంది. శంషాబాద్ సమీపంలోని చేగూర్ గ్రామం పరిసరాల్లో రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో 1400 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన కన్హా శాంతివనం మంగళవారం ప్రారంభమైంది. ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా ముఖ్య అతిథిగా హాజరై ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ ధ్యాన కేంద్రంలో ఒకేసారి ఏకంగా ఒక లక్ష మంది ధ్యానం చేసుకోవచ్చు. ఇక కన్హా శాంతివనం పై నుంచి చూస్తే తాబేలు ఆకారంలో ఉంటుంది. ఇందులో రోజుకు 1 లక్ష మందికి భోజనాలు పెట్టే విధంగా సదుపాయాలను ఏర్పాటు చేశారు. 350 పడకలు ఉన్న ఆయుష్ దవాఖాన, 6 లక్షల మొక్కలు కలిగిన నర్సరీలు ఈ ప్రాంగణంలో ఉన్నాయి.
కన్హా శాంతివనం ప్రారంభోత్సవం సందర్భంగా మూడు రోజుల చొప్పున మూడు విడతల్లో పలు కార్యక్రమాలను చేపట్టనున్నారు. జనవరి 28వ తేదీ నుంచి -30 వరకు, ఫిబ్రవరి 7 నుంచి -9వ తేదీ వరకు మూడు రోజులపాటు, ఫిబ్రవరి 2-4న నిర్వహించే కార్యక్రమాల్లో సుమారుగా 1.2 లక్షల మంది పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. జనవరి 28వ తేదీన ధ్యానకేంద్రాన్ని ప్రారంభించిన తర్వాత, 29న బాబా రాందేవ్ ప్రసంగిస్తారని, ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాల గవర్నర్లు సైతం పాల్గొంటారని వారు వెల్లడించారు. ఫిబ్రవరి 2వ తేదీన రాష్ట్రపతి రాంనాథ్కోవింద్, ఫిబ్రవరి 7వ తేదీన సామాజిక కార్యకర్త అన్నాహజారే పాల్గొని 75వ వార్షికోత్సవంలో ప్రసంగిస్తారని నిర్వాహకులు తెలిపారు. మొత్తం 1,400 ఎకరాల్లో హార్ట్ఫుల్నెస్ సంస్థ ఏర్పాటుకాగా, 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ ధ్యాన కేంద్రాన్ని నిర్మించారు. ఒక సెంట్రల్హాల్, 8 సెకండరీ హాల్స్ చొప్పున మొత్తం 9 హాల్స్ను ఇక్కడ నిర్మించారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/