సిరిసిల్లలో రెబల్స్ గెలిచారంటేనే అర్థమౌవుతుంది
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శలు
హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో తన ప్రభావాన్ని బిజెపి కొద్దొ గొప్పో చూపించింది. ఈ సందర్భంగా మీడియాతో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ, స్వీప్ చేస్తామని ప్రగల్భాలు పలికిన టిఆర్ఎస్, అక్కడక్కడా తుడిచిపెట్టుకుపోయిందని విమర్శించారు. ఈ ఎన్నికలు తమ పని తీరుకు నిదర్శమని కెటిఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావిస్తూ, సిరిసిల్లలోనే రెబెల్ అభ్యర్థులు గెలిచారంటే వాళ్ల పనితీరు ఏరకంగా ఉందో అర్థమౌతుందని విమర్శించారు. తమ ప్రభుత్వ పనితీరే నిదర్శనం అని చెప్పుకున్న టిఆర్ఎస్ ఈ ఎన్నికల్లో డబ్బులు పంచిపెట్టిందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ను, కాంగ్రెస్ ను, ఎంఐఎంను ను బిజెపి ఎదుర్కొందని చెప్పారు. ప్రజాతీర్పును చూస్తుంటే ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గంలో బిజెపి నాలుగు సీట్లు గెలిచిందని చెప్పారు. నిర్ణయాత్మకశక్తిగా ఎదుగుతున్నామని, కొన్ని ప్రాంతాల్లో టిఆర్ఎస్ కు, మరికొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి, భైంసా వంటి ప్రాంతంలో ఎంఐఎంకు దీటుగా తాము ఫలితాలు సాధించామని అన్నారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/