దర్శకుడికి భూకేటాయింపులపై హైకోర్టులో విచారణ
ఎకరం రూ.5 లక్షలకే కేటాయింపు
హైదరాబాద్: హైదరాబాదులో దర్శకుడు ఎన్.శంకర్కు సినీ స్టూడియో నిర్మాణం కోసం భూమిని కేటాయించాలంటూ గతంలో తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. దాంతో తెలంగాణ సర్కారు ఆయనకు రంగారెడ్డి జిల్లా మోకిల్లలో 5 ఎకరాల భూమి కేటాయించింది. ఎకరం రూ.5 లక్షల చొప్పున కేటాయించింది. అయితే, ఈ భూమి కోట్ల విలువ చేస్తుందని, అలాంటప్పుడు ఎకరాకు రూ.5 లక్షల చొప్పున దర్శకుడికి ఏ విధంగా కేటాయిస్తారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై హైకోర్టు తాజాగా విచారణ చేపట్టింది.
రూ.2.50 కోట్ల విలువైన భూమిని ఎంతో తక్కువ ధరకు ఏ ప్రాతిపదికన కేటాయించారంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడానికి తగిన ప్రాతిపదిక ఏమిటో చెప్పాలని అడిగింది. దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ, ఏజీ క్వారంటైన్ లో ఉన్నారని, తమకు కొంత గడువు కావాలని కోరారు. ఈ విజ్ఞప్తిని మన్నించిన తెలంగాణ హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/