సిఎం ప్రకటనపై స్పందించిన అసదుద్దీన్ ఓవైసీ
ప్రభుత్వ ప్రకటనను స్వాగతిస్తున్నాం..ఒవైసీ
హైదరాబాద్: తెలంగాణ సచివాలయం కూల్చివస్తున్న నేపథ్యంలో దెబ్బతిన్న ఆలయం, మసీదులను ప్రభుత్వ ఖర్చులతో తిరిగి నిర్మిస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రకటనపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ప్రభుత్వ ప్రకటనను స్వాగతిస్తున్నట్టు ఆయన తెలిపారు. దీనిపై యునైటెడ్ ముస్లిం ఫోరమ్ త్వరలో సవివరంగా ప్రకటన చేస్తుందని వెల్లడించారు. దీనిపై తాను మసీదు, ఆలయ నిర్వాహకులతో సమావేశం అవుతానని సిఎం కెసిఆర్ పేర్కొన్నారని, కొత్త సచివాలయంతో పాటే మసీదు, ఆలయ నిర్మాణాలు కూడా కొత్తవి చేపడతామని, ఇది తన హామీ అని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారని అసదుద్దీన్ వివరించారు. తెలంగాణ పూర్తిగా లౌకికవాద రాష్ట్రమని, కానీ, మసీదు, మందిరం కూల్చివేత ఊహించనిరీతిలో జరిగిపోయిందని సిఎం కెసిఆర్ విచారం వ్యక్తం చేశారని, దీన్ని రాగద్వేషాలకు అతీతంగా చూడాలంటూ ఆయన అభ్యర్థించారని పేర్కొన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/