బస్సులోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న బస్సు కండక్టర్

బస్సులోనే ఆర్టీసీ కండక్టర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబుబాబాద్​ జిల్లా తొర్రూరులో ఈరోజు (ఆదివారం) జరిగింది. తొర్రూరు ఆర్టీసీ డిపోలో జరిగిన ఈ ఘటన ఉద్యోగుల్లో షాక్ కలిగించింది. తొర్రూరు మండలం కంఠాయపాలెం గ్రామానికి చెందిన మహేందర్​రెడ్డి ఆదివారం ఉదయం డ్యూటీకి వచ్చాడు. సెక్యూరిటీ రిజిస్ట్రర్​లో సంతకంపెట్టి డిపోలోకి వెళ్లాడు.

అలా వెళ్లిన వ్యక్తి ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది వెళ్లి పరీశిలించగా.. బస్సులో విగతజీవిగా కనిపించాడు. వెంటనే సిబ్బంది డిపో అధికారులకు తెలియజేయగా..కండక్టర్​ ఆత్మహత్య విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. మహేందర్​రెడ్డి ఎందుకు సూసైడ్ చేసుకున్నాడనే దానిపై దర్యాప్తు మొదలుపెట్టారు.

ఈ ఘటనపై సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కన్నీటిపర్యంతమయ్యారు. మృతుడి ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ అధికారుల ఒత్తిడి వల్లే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నారని మృతుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు.