ఆరునెలల్లో కరోనా వైరస్‌కు ఔషధం

కరోనా విరుగుడుకు మందు తయారీకి చేతులు కలిపిన సిప్లా, ఐఐసీటీ!

Cipla, CSIR-IICT join hands for COVID-19 drugs
Cipla, CSIR-IICT join hands for COVID-19 drugs

హైదరాబాద్‌: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారికి విరుగుడు ఔషధం మరో ఆరు నెలల్లో అందుబాటులోకి వస్తుందని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐఐసీటీ (ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ), ఫార్మా దిగ్గజం సిప్లా అంటున్నాయి. ఈ రెండు సంస్థలూ కరోనాకు విరుగుడుగా పని చేయగలవని నమ్ముతున్న మూడు మందులను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. రెమిడెస్‌ విర్, బెలాక్సివిర్, ఫెవిపిరవిర్‌ అనే మూడు రసాయనాలు వైరస్‌ లను నిరోధిస్తాయని ఐఐసీటీ శాస్త్రవేత్తలు గుర్తించగా, ఈ రసాయనాలను తయారుచేసి తమకు ఇస్తే, వాటిని మాత్రలుగా మార్చి అందుబాటులోకి తెచ్చేందుకు సిప్లా ముందుకొచ్చింది. ఈ ఔషధాలపై ఇప్పటికే రెండు క్లినికల్‌ ట్రయల్స్‌ ముగిశాయని, అయితే, కొన్ని కారణాల వల్ల వీటిని ఇంకా మార్కెట్లోకి వదిలే పరిస్థితి లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే, అత్యవసర పరిస్థితులు ఏర్పడితే, వీటిని నేరుగా రోగులకు వినియోగించవచ్చని ఐఐసీటీ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీవారి చంద్రశేఖర్‌ వ్యాఖ్యానించారు. ఈ మూడు రసాయనాలతో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు జరిగాయని, అయితే, పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయని ఈ మందులను నిశితంగా పరిశీలించి, వీటితో వైరస్‌ లను ఎదుర్కోవచ్చన్న అంచనాకు వచ్చామని ఆయన తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/