తెలంగాణ ప్రభుత్వంపై జేపీ నడ్డా విమర్శలు
కేసీఆర్ ను కుంభకర్ణుడితో పోల్చిన నడ్డా
హైదరాబాద్: బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ జిల్లాల్లో బీజేపీ కార్యాలయాలకు సోమవారం భూమి పూజా కార్యక్రమంలో భాగంగా ఆన్లైన్లో మాట్లాడిన ఆయన.. తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. రూ. 45వేల కోట్లకు పూర్తి కావాల్సిన కాళేశ్వరం ప్రాజక్టును దోచుకోవటం కోసమే 85వేల కోట్లకు పెంచారని ఆయన మండిపడ్డారు. కరోనా విలయం సృష్టిస్తున్న వేళ సీఎం కేసీఆర్ వైఖరి కుంభకర్ణుడ్ని తలపిస్తోందని, తెలంగాణ సర్కారు ఇప్పటికీ అప్రమత్తం కావడంలేదని విమర్శించారు.
కరోనా పరీక్షలు చేయడంలో తెలంగాణ చురుగ్గా వ్యవహరించలేకపోతోందని అన్నారు. కేంద్రం తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో అమలు చేయకపోవడం వల్ల 98 లక్షల మందికి బీమా సౌకర్యం దూరమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పులు వ్యతిరేకంగా వస్తున్నా కేసీఆర్ సర్కారులో చలనం లేదని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో ఎలాంటి తీర్పు ఇచ్చారో, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ అలాంటి తీర్పే ఇవ్వాలని ప్రజలకు సూచించారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/