అటవీ సంపదను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు
హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
అదిలాబాద్: ఆరవ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బోథ్ నియోజకవర్గంలోని నేరడిగొండ మండలం బోరిగాం, బోథ్ మండలం కౌట బి గ్రామాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హరితహారం కార్యక్రమంలో భాగంగా క్షీణించిన అడవుల్లో పెద్ద ఎత్తున్న మొక్కలు నాటడమే కాకుండా అటవీ సంపదను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. అడవుల రక్షణ చర్యల్లో భాగంగా అడవిలోకి ఇతరులు ప్రవేశించకుండా దారులను మూసేందుకు కంచెలు, కందకాలు ఏర్పాటు చేశామన్నారు. అటవీ సంపదను కాపాడేందుకు పోలీసు శాఖ సహాకారంతో అటవీ అధికారులు ఆహార్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అడవుల సంరక్షణపై ప్రజల్లో కూడా అవగాహన పెరిగిందని, వారి భాగస్వామ్యం, నిరంతర నిఘా వల్ల కలప స్మగ్లింగ్ కు అడ్డుకట్ట వేయగలిగామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విప్లవాత్మకమైన పంచాయతీరాజ్, పురపాలక చట్టాలతో పచ్చదనం పెంపునకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, కలెక్టర్ దేవసేన, తదితరులు పాల్గొన్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/